వైసీపీది బ్రిటీష్ వాళ్ల పద్ధతి.. కులాలను ఉప కులాలను విభజించి పలుచన చేస్తోంది
బీసీల సర్వతోముఖాభివృద్ధికి జనసేన కట్టుబడి ఉంది
కల్లు గీత సొసైటీలకు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో వాటా
ప్రతి జిల్లా కేంద్రంలో శెట్టిబలిజ, గౌడ, ఉప కులాలకు కమ్యూనిటీ హాల్
ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో తాటి, ఈత చెట్లు పెంపకానికి ప్రణాళిక
భీమవరంలో శెట్టిబలిజ, గౌడ నాయకుల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ దేశంలో సగానికి పైగా ఉన్న బీసీ కులాలకు సంపూర్ణ రాజ్యాధికారం అందాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు. స్థానిక ఎన్నికల్లో 33 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను వైసీపీ ప్రభుత్వం 24 శాతానికి తగ్గించడంతో దాదాపు 16వేల మంది బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గించిన బీసీ రిజర్వేషన్లు పెంచడంతోపాటు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్లుగీత సొసైటీలకు వాటా కల్పిస్తామన్నారు. ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో తాటి, ఈత చెట్లు పెంచేలా చర్యలు తీసుకోవడంతోపాటు… శెట్టిబలిజ, గౌడ, సంబంధిత కులాలకు కమ్యునిటీ హాల్స్, కళ్యాణ మండపాలు నిర్మించేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వారాహి విజయయాత్రలో భాగంగా భీమవరంలో శెట్టిబలిజ, గౌడ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “బీసీల కోసమంటూ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం… వాటిని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశారు. వైసీపీ సానుభూతిపరులు, మద్దతుదారులను కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించారు తప్ప బీసీలకు ఎలాంటి మేలు చేయలేదు. శెట్టిబలిజ, గౌడ, శ్రీశైన, ఈడిగ, యాత ఇలా ప్రాంతాలను బట్టి విభిన్న పేర్లతో పిలుస్తున్న ఈ సామాజికవర్గాన్ని ఏకీకృతం చేసి గౌడ సామాజికవర్గంగా గుర్తించాలని సామాజికవర్గ పెద్దలు కోరుతున్నారు. ప్రాంతాల బట్టి విడిపోయి పలుచన అయ్యే బదులు కలిసి బలంగా ఉండాలనే జనసేన పార్టీ కోరుకుంటుంది. ఐదు కులాలను కలిపి సర్దార్ గౌతు లచ్చన్న గారు ప్రతిపాదించిన విధంగా గౌడు సామాజికవర్గంగా గుర్తించాలన్న పెద్దల కోరికకు జనసేన మద్దతు తెలుపుతుంది.