మహనీయుడు నడయాడిన ఊరు.. నడిచేందుకు రోడ్డు లేదు..
- శ్రీ పింగళి వెంకయ్య స్వగ్రామం బట్లపెనుమర్రు వాసుల రహదారి కష్టాలు
- రోడ్డు దుస్థితిపై గళం విప్పిన జనసేన
భరత జాతి సగర్వంగా తలెత్తుకు నిలబడేలా చేసిన మహనీయుడు.. జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య కు జన్మనిచ్చి నేల అది. ఆ మహనీయుడి పాదస్పర్శతో తరించిన వీధులు అవి.. ఆ మహనీయుని స్మారకానికి నెలవైన గ్రామం.. శ్రీ పింగళి వెంకయ్య స్వగ్రామం భట్ల పెనుమర్రు.. ఆ గ్రామానికి రాజకీయ గ్రహణం పట్టింది. కాదు రాష్ట్రానికి పట్టినట్టే వైసీపీ గ్రహణం పట్టింది. భట్లపెనుమర్రు వెళ్లి ఆ మహనీయుని స్మరించుకుందామంటే ఆ గ్రామంలో అడుగు పెట్టేందుకు సరైన రోడ్డు లేదు.. రోడ్లు మధ్యన గుంటలు ఉన్నాయా? గుంటల మధ్య రోడ్డు ఉందో తెలియని పరిస్థితి. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూచిపూడి నుంచి భట్ల పెనుమర్రు వెళ్లే మార్గం పూర్తిగా తటాకాన్ని తలపిస్తోంది. ఆ రహదారి దుస్థితిపై గురువారం పామర్రు జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీ తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మందలించినా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దు నిద్ర వీడలేదని మండిపడ్డారు. రహదారి నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం విడుదల చేసిన కోటిన్నర ఏమయ్యాని ప్రశ్నించారు. నిధులు విడుదల చేసి ఏడాది గడచినా పనులు ఎందుకు ప్రారంభించలేదో స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిధులు ఎటు దారి మళ్లాయో చెప్పాలన్నారు. పామర్రు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రహదారుల దుస్థితికి భట్ల పెనుమర్రు రోడ్డు అద్దం పడుతోందని మండిపడ్డారు. రహదారుల నిర్మాణం వెంటనే ప్రారంభించకుంటే అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీమతి కాకి ఝాన్సీ, పార్టీ నాయకులు శ్రీ చలమలశెట్టి శ్రీనివాసరావు, శ్రీ చలాది ప్రవీణ్ కుమార్, శ్రీ యర్రంశెట్టి వీరాస్వామి, శ్రీ శ్రీపతి శ్రీనివాసరావు, శ్రీ ఏనుగు వెంకటరత్నం, శ్రీ గోపిశెట్టి రాజశేఖర్, శ్రీ కొప్పర్తి శ్రీకాంత్, శ్రీ ఆకుల పవన్ కుమర్ తదితరులు పాల్గొన్నారు.