వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలి
- మోరంచపల్లి ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేయాలి
- సహాయక చర్యల్లో జనసేన శ్రేణులు పాలుపంచుకోవాలి
తెలంగాణ రాష్ట్రంలో ఎడతెగని భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలకు తోడు వరద ప్రభావం కూడా భూపాలపల్లి జిల్లాలో పలు గ్రామాలను జల దిగ్బంధం చేసింది. ఈ రోజు ఉదయం భూపాలపల్లి జిల్లా, మోరంచపల్లి గ్రామం వరదలో చిక్కుకున్న విషయం నా దృష్టికి వచ్చింది. దాదాపు 200 కుటుంబాలు సాయం కోసం ఎదురు చూస్తున్నాయి, అలాగే ములుగు జిల్లాలోని ముత్యాలధార జలపాతం వద్దకు వెళ్ళిన 40 మంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయిన విషయం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు సత్వరమే బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేయాలి. మరో పక్క నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ గరిష్ట స్థాయి దాటి నీరు ఉప్పొంగడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జనసేన నాయకులు, శ్రేణులు బాధిత ప్రజలకు అవసరమైన సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని జనసేనాని కోరారు.