రత్నాల చెరువు ముంపు ప్రాంతంలో జనసేన నేతల పర్యటన
- గ్రామాల్లోకి చొక్కుకు వచ్చిన నీరు
- ఎమ్మెల్యే నిర్లక్ష్యమే ముంచిందన్న శ్రీ చిల్లపల్లి
- శ్రీ చిల్లపల్లి వద్ద సమస్యలు ఏకరువు పెట్టిన జనం
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే చిన్ని పాట వానలకు కూడా ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తోందని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి చర్యలు తీసుకుంటామంటూ ఊదరగొట్టే అధికార పార్టీ నాయకులు, ఆపద రాకముందు మాత్రం పరిష్కారం ఆలోచించరని మండిపడ్డారు. భారీ వర్షాలకు ముంపు భారిన పడిన మంగళగిరి పట్టణం రత్నాల చెరువు పరిసర ప్రాంతాల్లో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ చిల్లపల్లి మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే ఆర్కే నిర్లక్ష్యానికి రత్నాల చెరువు ముంపు సజీవ సాక్ష్యమన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారిని పలుకరించకుండా ఎమ్మెల్యే రెండు ఫోటోలు దిగి వెళ్లిపోవడమేంటని ప్రశ్నించారు. గత మూడు నెలలుగా గుంటూరు ఛానల్ లో పూడిక తీయలేకపోయారు. కనీసం గుర్రపు డెక్కను కూడా ఈ ప్రభుత్వం తొలగించలేకపోయింది. కాజా గ్రామస్తులే కొంత మేర పూడిక తీసుకుని ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి పని చేశారు. అయినా ప్రభుత్వంలో కదలిక లేదు. దీంతో కొద్దిపాటి వర్షానికే గుంటూరు ఛానల్ నిండిపోయి సమీపంలో ఉన్న గ్రామాల మీద పడుతోంది. గుంటూరు ఛానల్ లో గుర్రపు డెక్క, పూడిక తీత పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.
పదేళ్లుగా రత్నాల చెరువు పరిసరాల దుస్థితి అలాగే ఉంది. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వైసీపీ అధికారం చేపట్టి నాలుగున్నరేళ్లు పూర్తవుతున్నా ఇచ్చిన హామీని గాలికి వదిలేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ సమస్యల మీద మాట్లాడితే వ్యక్తిగతంగా దాడి చేస్తారు. నోటికి వచ్చినట్టు తిడతారు. ముంపు ప్రాంతాల్లో ప్రజల అవస్తలు వర్ణనాతీతంగా ఉన్నాయి. చేనేత మగ్గాల్లోకి నీరు చేరిపోయింది. రత్నాల చెరువు పరిసరాల్లో ఉన్న మగ్గాల్లోకి మొకాలు లోతు నీరు చేరి నేతన్నలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని చేనేతల దుస్థితిపై ఎన్నో సార్లు హెచ్చరించినా ఫలితం లేదు. నేతన్న నేస్తం విషయంలోనూ మంగళగిరి నియోజకవర్గానికి అన్యాయం జరిగింది. నియోజకవర్గంలో 2 వేల మంది లబ్దిదారులు ఉంటే కేవలం 400 మందికి మాత్రమే ప్రభుత్వం నేతన్న నేస్తం ఇచ్చింది. ప్రజల సమస్యల మీద వెంటనే దృష్టి సారించకుంటే రానున్న రోజుల్లో ప్రజలు వైసీపీకి రాజకీయ సమాధి కట్టేస్తారని హెచ్చరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.