మంగళగిరిలో వారాహి యాత్ర పోస్టర్ విడుదల
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం.. ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్రను విజయవంతం చేయాలని పార్టీ మంగళగిరి ఇంఛార్జ్, చేనేత వికాస విభాగం ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జూన్ 14వ తేదీన అన్నవరం నుంచి ప్రారంభం కానున్న వారాహి యాత్ర ఉభయ గోదావరి జిల్లాల్లోని 14 నియోజకవర్గాల్లో కొనసాగుతుందన్నారు. యాత్రలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు, మత్స్యకారులు, చేనేతల సమస్యలపై అధ్యయనం చేస్తారని, పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారం కోసం కృషి చేస్తారని తెలిపారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో వారాహి యాత్ర గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ చిల్లపల్లి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చేపడుతున్న ఈ యాత్రలో అంతా భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.
