మాటకు కట్టుబడి ఉండే పార్టీ జనసేన
జనసేన రాజకీయ ప్రస్థానంలో అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తాం
తూర్పు కాపుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తాం
పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన తూర్పు కాపు యువత
‘తూర్పు కాపులకు రాజకీయ సాధికారిత అవసరం. కొంతమంది స్వార్థ రాజకీయాలకు ఆ వర్గం ఇబ్బందుల పాలవుతూ, సంక్షేమ ఫలాలకు దూరం అవుతుంది. ఇప్పటి వరకు ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే ఉపయోగించుకొని కొందరు లాభపడ్డారు తప్ప సామాజికవర్గానికి చేసిన మేలు ఏమీ లేద’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. తూర్పు కాపులు ఒక్క ఉత్తరాంధ్ర జిల్లాలకే పరిమితం కాలేదని, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్నారని అన్నారు. శుక్రవారం తణుకు నియోజకవర్గ తూర్పుకాపు సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఇతర పార్టీల నుంచి భారీగా తూర్పుకాపు యువత శ్రీ మనోహర్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి శ్రీ మనోహర్ గారు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు ఉన్నతమైన, వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “తూర్పు కాపులు అంటే కష్టించే వ్యక్తులు. ఎక్కడో ఉత్తరాంధ్ర నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లి అక్కడ ఉన్న సామాజికవర్గాలతో కలసిమెలసి జీవించే మనస్తత్వం ఉన్నవారు. తూర్పుకాపు సంక్షేమ సంఘం నుంచి శ్రీ పిసిని చంద్రశేఖర్ గారు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, నన్ను కలిసినప్పుడు మీ సమస్యలు ఏంటి? ఇంతవరకు నాయకులు ఎందుకు పరిష్కరించలేకపోయారని అడిగి తెలుసుకున్నాం. గత మూడు నెలలు పాటు తూర్పు కాపుల సమస్యలపై అధ్యయనం చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తూర్పు కాపులను సమాయత్తం చేసి ఒక వేదికపైగా తీసుకురావాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నాన్ని మనమంతా అభినందించాలి. తూర్పు కాపుల్లో రాజకీయ వెనకుబాటుతనం ఉంది. రాజకీయ ప్రస్థానంలో అందర్నీ కలుపుకొని ముందుకు వెళతాం. ఇతర పార్టీ నాయకుల్లా మాట ఇచ్చి మిమ్మల్ని మోసగించే వ్యక్తులం కాదు. మాట ఇచ్చామంటే దానికి కట్టుబడి పనిచేస్తాం. ఎలక్షన్ కోసమో, రాజకీయ లబ్ధి కోసమో జనసేన పార్టీ ఎప్పుడు మాట ఇవ్వదు. సమాజానికి, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అని నమ్మితేనే మాట ఇస్తాం. తూర్పు కాపులకు భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుంది. తూర్పు కాపులు ఓబీసీ సర్టిఫికేట్ల కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. మన ప్రభుత్వం రాగానే దానిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకంటాం” అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ విడివాడ రామచంద్రరావు, పార్టీ నేతలు శ్రీ చనమల్ల చంద్రశేఖర్, శ్రీ నవీన్ కుమార్ పాల్గొన్నారు.