మహిళలు… బాలికల అదృశ్యంపై జగన్ సర్కార్ ఇప్పుడేం చెబుతుంది?
- ఫ్యాక్ట్ చెక్ పేరుతో మసి పూసి మారేడు కాయ చేయాలని చూశారు
- గణాంకాల ఆధారంగానే శ్రీ పవన్ కళ్యాణ్ వాస్తవాలు వెల్లడించారు
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ మిశ్రా మహిళలు, బాలికల అదృశ్యంపై రాజ్యసభకు ఇచ్చిన సమాచారాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు చదువుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో కోరారు. 2019 నుంచి 2021 మధ్య కాలంలో 30 వేల మందికిపైగా మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారని ఆ సమాచారంలో స్పష్టంగా చెప్పారు. ఇదే విషయాన్ని మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో ప్రజలకు తెలియచెప్పారు. జగన్ ప్రభుత్వంలోని మంత్రుల నుంచి పోలీసు ఉన్నతాధికారుల వరకూ ఈ వాస్తవాలపై అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేశారు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో తప్పుడు లెక్కలు చూపించి మసి పూసి మారేడు కాయ చేసిన అధికార యంత్రాంగం కేంద్ర హోమ్ శాఖ పార్లమెంట్ కి ఇచ్చిన సమాచారంతో ఏం చెబుతుంది? ఇప్పుడు కేంద్ర హోమ్ శాఖ ఇచ్చిన గణాంకాలను కూడా జగన్ సర్కార్ తప్పుబడుతుందా? ఆ లెక్కలను విమర్శిస్తూ ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఏమైనా చెబుతుందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, బాలికల అదృశ్యం సమస్య ఎంత తీవ్రంగా ఉందో శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు. కాబట్టే ఆ తీవ్రతను గణాంకాల ఆధారంగా తెలియచేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. వాస్తవాలను అంగీకరించలేని స్థితిలో జగన్ ప్రభుత్వం ఉంది. కాబట్టే అనుచిత వ్యాఖ్యానాలు చేస్తూ, ప్రశ్నిస్తే వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ సభ్యత మరచిపోయి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఇకనైనా వైసీపీ ప్రభుత్వం బాలికలు, మహిళల రక్షణపై దృష్టిపెడితే మంచిదని శ్రీ మనోహర్ హితవు పలికారు.