ఏపీ మహిళా కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది?
(బాలికలు, మహిళల అదృశ్యంపై రాజ్యసభకు కేంద్ర హోమ్ శాఖ ఇచ్చిన సమాచారంపై జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు. ఆ సమాచారం ఇది..)
కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ క్రింది విధంగా సమాధానమిచ్చారు.
2019 నుంచి 2021 వరకు మూడు సంవత్సరాలలో, ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 30,196 మంది మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలు 7918 మంది, 18 ఏళ్లు పైబడిన మహిళలు 22,278 మంది అదృశ్యమయ్యారు.
గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే, మన ఆంధ్రప్రదేశ్లో తప్పిపోయిన బాలికలు, మహిళల సంఖ్య పెరుగుతున్న ధోరణిలో ఉంది. మన అమ్మాయిలు, మహిళలు ఎందుకు తప్పిపోయారు? వారికి ఏమి జరుగుతోంది? ఎవరు బాధ్యత తీసుకుంటారు?
రేపు ఏపీ మహిళా కమిషన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దీనిపై బహిరంగంగా మాట్లాడుతుందా? ఏపీ మహిళా కమిషన్ హోం శాఖ, డీజీపీని వివరణ కోరుతుందా? ఎట్టకేలకు వైసీపీ ప్రభుత్వాన్ని ఏపీ మహిళా కమిషన్ ప్రశ్నిస్తుందా?
ఈ అంశంపై హోంమంత్రి, డీజీపీ స్పందించాలని జనసేన డిమాండ్ చేస్తోంది.